ప్రవీణ్ సత్తారు మంచి సత్తా ఉన్న దర్శకుడు. లవ్ బిఫోర్ వెడ్డింగ్ ద్వారా దర్శకుడిగా పరిచయమై, పీఎస్వీ గరుడవేగ తో రాజశేఖర్ కి ఓ మెమొరబుల్ హిట్ ఇచ్చాడు. ఇటీవలే 'లెవంత్ అవర్' అంటూ ఓ వెబ్ సిరీస్ తో మెరిపించాడు. చందమామ కథలు, గుంటూర్ టాకీస్.. ఇలా అన్నీ విభిన్నమైన సినిమాలే తీశాడు. ఇప్పుడు నాగార్జునతో తొలిసారి ఓ యాక్షన్ మూవీ తీస్తున్నాడు. ఇందులో నాగ్ 'రా' ఏజెంట్ గా కనిపిస్తాడని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలొచ్చాయి కూడా. అయితే అలాంటిదేమీ లేదని కరోనా ప్రభావం తగ్గాక కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం.
నారాయణ దాస్ నారంగ్, రామమోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని నిర్మాతలు తెలిపారు. లండన్ లో షూటింగ్ జరపాలనుకుంటున్నారట. దీనికోసం చిత్ర బృందం లండన్ కు ప్రయాణం అవుతోందట. ఈ సినిమాలో నాగార్జునకి జంటగా కాజల్ నటిస్తోంది. ఓవైపు ఆచార్య మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్న కాజల్, అదే సమయంలో నాగార్జునకి కూడా జంటగా కనిపించబోతోంది. పెళ్లి తర్వాత కాజల్ స్పీడ్ తగ్గుతుందని అందరూ అనుకుంటున్నా.. ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో నటిస్తోంది.