ఖలేజా సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగనమల రమేష్, సీ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించగా విలక్షణ నటుడు ప్రజాష్ రాజ్ విలన్ పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా దైవం మనుష్య రూపేణా అనే భావన నేపథ్యంలో తెరెకెక్కింది. ఓ భారీ బిజినెస్ మ్యాన్ చేసే దుష్టచర్యలను ఓ టాక్సీ డ్రైవర్ ఎలా ఎదుర్కున్నాడు అనేది సినిమా కథ. ఇందులో విలన్ చేత బాధింపబడుతున్న ఓ గ్రామ ప్రజలు హీరోను దేవుడిగా కొలుస్తారు. అంతేకాకుండా హీరోను కూడా నమ్మిస్తారు. అయితే ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ అభిమానులు ఊహించిన విధంగా సినిమా ఆకట్టుకోలేక పోయింది. ఖలేజా చిత్ర యూనిట్కి ఊహించని ప్లాప్గా ఈ సినిమా నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు అనే ఓ టాక్సీ డ్రైవర్ పాత్రలో మహేష్ నటించాడు. ఈ సినిమాలో కథ, కథనంతో పాటు అన్ని విషయాలు వైవిధ్యంగా ఉన్నా సినిమా రాణించలేక పోయింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన బాణీలకు అనుగుణంగా రామజోగయ్య శాస్త్రి పాటలను రచించారు. కానీ అభిమానులు ఊహించినటువంటి అంశాలు సినిమాలో అంతగా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కానీ ఈ సినిమా టీవీల్లో వచ్చిన ప్రతి సారి ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాల్లో ఖలేజా టాప్లో ఉంటుంది.