ఇదే సమయంలో అప్పటికే చిత్రం, జయం వంటి చిన్న చిత్రాలతో పెద్ద విజయాలను సాధించిన దర్శకుడు తేజ.. మహేష్ కాంబోలో తెరకెక్కి 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నిజం. దీని బడ్జెట్ ఆరున్నర కోట్లు. నటనాపరంగా మహేష్కు నూటికి నూరు మార్కులు పడిన చిత్రమిది. అప్పట్లో మంచి అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. మహేష్ కూడా ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మహేష్బాబు సరసన రక్షిత కథానాయిక. మహేష్ నటన ఈ చిత్రానికి హైలెట్ కాగా.. అతడిని మోటివేట్ చేసే తల్లి పాత్రలో తాళ్లూరి రామేశ్వరి కూడా గొప్ప నటనను కనబరిచారు. అన్యాయంగా తండ్రిని కోల్పోయిన హీరో..అందుకు కారణమైన ప్రభుత్వ ఉద్యోగులను, సంఘ వ్యతిరేక శక్తులను తల్లి సాయంతో ఒక పథకం ప్రకారం మట్టుపెట్డడం ఈచిత్ర కథ. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇది బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశ పరచింది.
నిజం చిత్ర పరాజయానికి కారణం దీనికంటే ముందు వచ్చి అన్ని వర్గాల ప్రజలనూ మెప్పించిన ఒక్కడు చిత్రమేనని దర్శకుడు తేజ పలుసార్లు చెప్పాడు. ఒక్కడు చిత్రానికి ముందు మహేష్బాబు ఇమేజ్ వేరని, దానిని దృష్టిలో ఉంచుకుని తాను నిజం కథ రాసుకున్నానని, కాని ఒక్కడు మాస్ హీరోగా మహేష్ స్థాయిని ఎక్కడికో తీసుకుపోయిందని తేజ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే నిజంలో ఓ ఇన్నోసెంట్ గై పాత్రలో మహేష్ ను అతడి అభిమానులతోపాటు, సామాన్య ప్రేక్షకులు కూడా ఆమోదించలేకపోయారన్న దర్శకుడి మాటల్లో వాస్తవముందనే చెప్పాలి.