ఈ సినిమా విడుదల అయ్యాకనే టాలీవుడ్ లో హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఎక్కువయింది. 2013లో సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమాలో సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. వెంకటేష్ మహేష్ బాబులు అన్నదమ్ములుగా నటించగా అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణి హట్టంగడి నటించారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను 2012లో చేశారు.
ఇందులో మహేష్ బాబు గోదావరి యాసలో తొలగించిన డైలాగులకు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయి చే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకునే సమంత ఈ చిత్రం నుంచి తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర, దూకుడు, గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2013వ సంవత్సరానికి గాను నంది పురస్కారాలు అందుకుంది ఈ చిత్రం. ఉత్తమ కుటుంబకథా చిత్రంగా, ఉత్తమ సహాయ నటుడుగా ప్రకాష్ రాజ్, ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రత్యేక బహుమతి ని అంజలి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.