బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన రాధే చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రూ.249 టికెట్ ధరతో విడుదల చేయగా అభిమానులు ఎగబడటంతో నిర్మాతలు బాగానే సొమ్ముచేసుకున్నారు. శాటిలైట్స్, ధియేట్రికల్, ఓటీటీ కలిసి పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చింది. నష్టపోయింది మాత్రం అభిమానులే. తాజాగా ఆ జాబితాలో ధియేటర్ యజమానులు కూడా చేరారు.
రెండు ధియేటర్లలో రూ.6వేల వసూళ్లు!!
కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రజలు ధియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ సినిమా కాబట్టి ఎంత నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ధియేటర్కు అభిమానులు వస్తారనే అంచనాతో ముంబయిలోని రెండు ధియేటర్లలో రాధే విడుదల చేశారు. కేవలం 84 టికెట్లు అమ్ముడుబోయి ఆరువేల రూపాయిలు వచ్చాయి. దీంతో ధియేటర్ యజమానులు విస్తుబోయారు. సూపర్స్టార్ కాబట్టి ఓ మోస్తరుగానైనా సినిమా చూడటానికి వస్తారని అంచనా వేయగా కనీసం 100 టికెట్లు కూడా అమ్ముడుబోక పోవడం విస్మయానికి గురిచేసింది. ఇంత తక్కువ వసూళ్లు రావడమంటే ఇది సల్మాన్ సినిమాకు పరాభవమే అని ట్రేడ్ పండిట్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రేక్షకుల సంగతి దేవుడెరుగు..
సామాన్య ప్రేక్షకుల సంగతి దేవుడెరుగు.. రాధే చిత్రం చూసిన సల్మాన్ ఖాన్ అభిమానులే తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంత దారుణమైన సినిమా తీశాడేంట్రా బాబూ అంటూ ప్రభుదేవాపై సోషల్మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలుకే ఐఎండీబీలో చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. సల్మాన్ కెరీర్ మొత్తంమీద అతి తక్కువ రేటింగ్ వచ్చిన చిత్రం రాధే అని ఇప్పటికే టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో విడుదల చేస్తున్నప్పుడే కొవిడ్ తగ్గుముఖం పట్టాక ధియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు విడుదల చేయగా 84 టికెట్లు అమ్ముడుబోయి ఆరువేల రూపాయలు వసూలు చేయడంపై బాలీవుడ్ వర్గాలు కూడా పెదవి విరుస్తున్నాయి. చిత్రమేమిటంటే ఈ సినిమాకు నిర్మాత కూడా సల్మాన్ ఖాన్ కావడం విశేషం. ఎటువంటి నష్టం లేకుండా రెండురెట్ల లాభాన్ని ఇప్పటికే ఆయన కళ్లచూశారు.