సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తేజ తీసిన యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ నిజం. 2003 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ ఈ సినిమాలో సీతారాం అనే పాత్రలో అత్యద్భుత నటన కనబరిచిన మహేష్ బాబు కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుని తెచ్చిపెట్టింది. చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో మహేష్ తల్లిగా సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి నటించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా నటించగా కీలకమైన ఒక నెగటివ్ పాత్రలో ప్రముఖ నటి రాశి నటించారు.
సినిమాలో ఆమె పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ రాశి తన నటనతో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్, త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల రాగా ఈ మూవీ ని జులై లో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ టైటిల్, కథ కి సంబంధించి కొద్దిరోజులుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుండగా లేటెస్ట్ మరొక వార్త ఎంతో వైరల్ అవుతోంది.
అదేమిటంటే, ఈ సినిమాలో మహేష్ కు వదినగా నటి రాశి యాక్ట్ చేయనున్నట్లు చెప్తున్నారు. త్రివిక్రమ్ సినిమాల్లో స్త్రీ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది, అదే విధంగా ఈ సినిమాలో రాశి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, అటువంటి పాత్ర ఆమె మాత్రమే పోషించగలదని భావించిన త్రివిక్రమ్, ఇటీవల రాశిని కలిసి కథ, కథనాలు వినిపించి ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: