కొందరు సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ బారినపడి తమ ప్రాణాలు కూడా కోల్పోవడం మరింత బాధాకరం. మరోవైపు ఇండస్ట్రీ ఏటా అందే ఆదాయం అందక పోగా నష్టాల ఊబిలో కూరుకు పోయింది. టాలీవుడ్లో ఏడాదికి సుమారు 200కు పైగా సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తాయి. ప్రేక్షకులకు ఓ వైపు వినోదాన్ని పంచుతూనే ఆర్థికంగా పుంజుకుంటాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ అయితే భారీ వసూళ్లకు పెట్టింది పేరు. కానీ రెండేళ్ల నుండి ఈ వైరస్ వలన పరిస్థితులు తారుమారై సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు సైతం భారీగా నష్టపోయారు. మధ్యలో ఈ ఏడాది జనవరి నెలలో కాస్త వైరస్ వ్యాప్తి తగ్గడంతో మళ్లీ షూటింగ్ లకు, సినిమాల రిలీజ్ కు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. ఈ గ్యాప్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రాలు రిలీజ్ అవగా, మరికొన్ని సినిమాలు తిరిగి చిత్రీకరణలో బిజీ అయ్యాయి.
దాంతో పరిశ్రమ పూర్వవైభవం పుంజుకోవడానికి ప్రయత్నించింది. ఈ లోపే మళ్లీ సెకండ్ వేవ్ మొదలై ఆ ఆనందం ఎక్కువసేపు ఉండనివ్వలేదు, తిరిగి లాక్ డౌన్ తో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ లెక్కన గత రెండేళ్ల నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమ 750 కోట్లు వరకు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు. 2020 సంవత్సరంలో 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. కరోనా ఉధృతి గణనీయంగా తగ్గుతుండటంతో తిరిగి పరిశ్రమలకు తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించేందుకు ఒక్కొక్కటిగా పర్మిషన్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు కూడా ఓపెన్ చేయొచ్చు అని, ఆగిపోయిన షూటింగ్లు పునఃప్రారంభించ వచ్చని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ రాష్ట్రం కూడా ఈ దిశగా త్వరలో నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. అయితే రిలీజ్ కు రెడీ గా పలు క్రేజి ప్రాజెక్టులు ఒక్కొటిగా విడుదలై ఇప్పటి వరకు వచ్చిన నష్టాన్ని తమ విజయాలతో పూడుస్తాయెమో చూడాలి.