అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ట్రెండ్ మారుస్తున్నారనే సంగతి మీరు గమనిస్తున్నారా? ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. 2000 నుంచి 2020 వరకు ఈ రెండు దశాబ్దాల సమయంలో బాలకృష్ణ చేసిన సినిమాలు చూస్తే మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆయన మంచి పేరున్న బ్యానర్లలోకానీ, అగ్ర దర్శకులుగా వెలుగొందుతున్నవారి దర్శకత్వంలోకానీ ఆయన నటించలేదు. వారు ఆయన దగ్గరకు రాలేదా? లేదంటే ఆయనే వారిదగ్గరకు వెళ్లలేదా? అనే విషయమై బాలకృష్ణకానీ, ఆయన అభిమానులు కానీ దీనిపై స్పష్టతనివ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు అనుగుణంగా సినిమాలు చేస్తున్నారు. ఎంతలో ఎంత మార్పో చూశారా?
వేళ్లమీద లెక్కపెట్టవచ్చు..??
పైన పేర్కొన్న రెండు దశాబ్దాల సమయంలో బాలయ్య చేసిన బ్యానర్లుకానీ, దర్శకులను కానీ వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎప్పుడైతే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాల చేయడం ప్రారంభించారో అప్పటినుంచి ఆయన నెమ్మదిగా తనకు ఇష్టమైన రీతిలో కాకుండా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్, తన అభిమానులు కోరుకున్న రీతిలో, అందరికీ నచ్చేలా అనే కోణంలో సినిమాలు చేయడం ప్రారంభించారు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను మైత్రీమూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న బ్యానర్ కావడంతోపాటు క్రాక్ చిత్రంతో దర్శకుడు గోపీచంద్ కూడా మంచి స్వింగ్లో ఉన్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య మరోసినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది నిర్మించే సంస్థ ఎవరంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు సొంత బ్యానర్లాంటి అందులో సినిమా చేస్తున్నారంటే బాలకృష్ణ ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా వెళుతున్నట్లే లెక్క.
రికార్డులు సృష్టించడంవరకే మాపని
ఆదిత్య 369 చిత్రానికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ తాను హారిక అండ్ హాసిని బ్యానర్లో సినిమాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. కాస్తంత ఆలస్యమైనా నడుస్తున్న ట్రెండ్కు అనుగుణంగా బాలయ్య అగ్ర దర్శకులు, అగ్ర బ్యానర్లలో చిత్రాలు చేస్తుండటంపై ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కథానాయకుడు ఇలాచేస్తే రికార్డులు బద్ధలవ్వడంకన్నా రికార్డులు సృష్టించే పనిలోనే ఉంటారంటూ మాట్లాడుకుంటున్నారు.