"రౌద్రం రణం రుధిరం" (ఆర్ఆర్ఆర్) చిత్రం ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. దానికి ప్రధాన కారణం రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ కావడమే. అంతేకాకుండా స్వాతంత్ర్యానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనే యోధుల కథను కల్పితంగా సృష్టించడం కూడా మరో రీజన్. ఇందులో టాప్ స్టార్స్ తో పాటు ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బంది కూడా పాలు పంచుకుంటున్నారు.  ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ వంటి దిగ్గజ నటీనటులు కనిపించబోతున్నారు. నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న "ఆర్ఆర్ఆర్"ను డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న "ఆర్ఆర్ఆర్" సినిమా షూటింగ్ పనులు హైదరాబాద్ లో చురుగ్గా సాగుతున్నాయి. మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే డబ్బింగ్ అయిపోయింది. ఈ చిత్రంలో ఇంకా 2 సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. 

నేడు హీరోయిన్ అలియా భట్ హైదరాబాద్ లో జరుగుతున్న సాంగ్ షూటింగ్ లో పాల్గొంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ గురించి ఆసక్తి మొదలైంది. దీని గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అమిత్ త్రివేది ఈ సినిమాలో ఒక పాట పాడినట్లు వెల్లడించారు. అది కూడా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ఆయన శృతి కలిపారట. సినిమాలో కీరవాణితో కలిసి పాట పాడడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ ఆయనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు. మరోవైపు ఈ చిత్రానికి మరో సంగీత దర్శకుడు పని చేయనున్నాడు అనే వార్త ప్రచారమవుతోంది. తమిళ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రమోషన్ కోసం స్పెషల్ గా మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని అంటున్నారు.ఇక "రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్"తో అంచనాలు పెంచేసిన చిత్ర బృందం ప్రమోషనల్ సాంగ్ ఏ రేంజ్ లో చూపిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: