తమిళ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ యాషికా ఆనంద్ జూలై 25 తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలోతీవ్ర గాయాల పాలైనప్పటి నుండి యాషిక అభిమానులు ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి యాషిక హెల్త్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె నడుపుతున్న కారు అదుపు తప్పి రైలింగ్‌ ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడిపోయింది. ఆమె స్నేహితుల్లో ఒకరు వల్లి చెట్టి భవానీ అక్కడికక్కడే చనిపోగా, మిగతా ముగ్గురిని చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంతకుముందు యశికా సోదరి ఓషీన్ ఆనంద్ మాట్లాడుతూ యాషిక ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ ఇచ్చింది. తాను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియులో ఉన్నానని, మరికొన్ని రోజుల్లో ఆమెకు పలు శస్త్రచికిత్సలు జరుగుతాయని చెప్పారు. "దయచేసి ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉండండి" అని యాషిక సోదరి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో వెల్లడించింది.

ఇప్పుడు ఆమె తన అభిమానులకు ఉపశమనం కలిగించే మరో అప్డేట్ తీసుకు వచ్చింది. యశికా ఇప్పుడు స్పృహలోకి వచ్చిందని, పలు సర్జరీలు పూర్తయ్యాయని ఒషీన్ చెప్పుకొచ్చింది. "మీ ప్రార్థనలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉండాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఆమెకు క్లిష్టమైన దశ ఉంటుంది" అని ఆమె తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు యషిక డ్రైవింగ్ చేస్తూ ఉన్నందున ఆమెపై ఐపిసి సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం అవ్వడం)తో సహా మూడు విభాగాల్లో కేసు నమోదైంది. పోలీసులు ఆమె లైసెన్స్‌ను కూడా జప్తు చేశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాతే అసలేం జరిగింది అనే విషయం వెల్లడవుతుంది. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమె తాగి డ్రైవింగ్ చేసిందని, అందుకే యాక్సిడెంట్ జరిగిందని, నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయిందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: