వచ్చే ఏడాది సంక్రాంతికి మూడు భారీ బడ్జెట్ మూవీస్ తో బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. జనవరి 12న పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "అయ్యప్పన్ కోషియం" రీమేక్, జనవరి 13న "సర్కారు వారి పాట", జనవరి 14న "రాధేశ్యామ్" విడుదలకు రెడీగా ఉన్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కరోనా కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడడమే ఈ బాక్స్ ఆఫీసు యుద్ధానికి దారి తీసింది. ఈ మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడటమే పెద్ద విశేషం అనుకుంటుంటే టాలీవుడ్ లో మరో బిగ్ క్లాష్ చోటు చేసుకోబోతోంది. మంగళవారం ఉదయం ఎలాంటి హడావుడి లేకుండా "పుష్ప" సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి ముందు "పుష్ప" టీం ఎలాంటి సందడి చేయలేదు. కానీ అంతకు ముందు రోజు మాత్రం సినిమా నుంచి "దాక్కో దాక్కో మేక" అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ కు "పుష్ప"రాజ్ ఒంటరిగా రాబోతున్నాడు అనుకున్న వాళ్లకు షాకిస్తూ మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నట్టు సమాచారం. 

దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న మరో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ "కేజిఎఫ్ 2". ఈ సినిమా కూడా క్రిస్మస్ బరిలోకి దిగనుంది అంటున్నారు. మేకర్స్ చాలా కాలంగా ఈ సినిమాను విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్లు ప్రకటించడంతో ఇదే సరైన సమయం అని భావించి డిసెంబర్లో "కేజిఎఫ్-2"ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు బాలీవుడ్ మూవీ "లాల్ సింగ్ చాద్ధా" కూడా క్రిస్మస్ ని టార్గెట్ చేసింది. ఇది పేరుకు బాలీవుడ్ చిత్రమైనా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక "పుష్ప"రాజ్ కి పోటీగా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఈ వార్తలు నిజమైతే క్రిస్మస్ కూడా మరో వార్ తప్పదు. ఈ ఏడాది క్రిస్మస్ మరో బిగ్ క్లాష్ గా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. మరి "పుష్ప"రాజ్ ఈ పోటీని తట్టుకోగలడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: