ఇవన్నీ ఇలా ఉంటే ఎన్టీయార్ ఆ రోజుల్లో ఉధృతంగా నటిస్తున్నారు. ఆయన అడవి రాముడు మూవీ సూపర్ హిట్ తరువాత మళ్లీ స్పీడ్ పెంచేశారు. వరస హిట్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నారు. ఆ టైమ్ లో ఆయనతో వడ్డే రమేష్ అనే నిర్మాత సినిమా తీయాలనుకున్నారు. ఆయన బ్యానర్ కి పర్మనెంట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఆ విధంగా బొబ్బిలి పులి అనే సినిమా కుదిరింది. ఈ మూవీ కోసం ఎన్టీయార్ ఏకంగా 32 రోజుల కాల్షీట్లు ఇచ్చారు.
ఆ తరువాత ఏమైనా కూడా ఒక్క రోజు కూడా అదనంగా ఇచ్చేది లేదు అని కూడా ఎన్టీయార్ ఖరాఖండీగా చెప్పేశారు. ఇక సినిమా షూటింగ్ మొదలైంది. కధా స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు దర్శకత్వం అన్నీ దాసరి చూస్తున్నారు. ఆయన కధ ఒకటి పక్కాగా అనుకున్నప్పటికీ షూట్ చేస్తున్న టైమ్ అనుకున్న బెటర్ మెంట్ రావడంలేదుట. దాంతో ఆయనతో పాటు మిగిలిన వారికి కూడా సినిమా చప్పగా వస్తోంది అన్న భావన కలిగిందిట.
ఈలోగా ఎన్టీయార్ డేట్స్ అన్నీ అయిపోయాయి. ఇక సినిమాకు ఆయువు పట్టు అయిన కోర్టు సీన్లతో పాటు చాలా సీన్లను ఆ తరువాత దాసరి రాసారుట. అయితే ఎన్టీయార్ కాల్షీట్ల కోసం మళ్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇచ్చారుట. అలా సినిమా మొదలుపెట్టి ఇంకా బెటర్ గా ఫినిషింగ్ టచ్ ఇచ్చారుట. ఆ సినిమా రిలీజ్ కి కూడా సెన్సార్ బోర్డు అడ్డు కట్ట వేసింది. అందులో చాలా సీన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని బ్యాన్ చేశారు. మొత్తానికి పోరాడి మరీ దాసరి ఈ మూవీని రిలీజ్ చేయించారు. 1982 జూలై 9న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతే కాదు, ఎన్టీయార్ రాజకీయ రంగ ప్రవేశానికి ఆయన తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి కూడా ఉపయోగపడింది.