శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్పందన వ్యక్తం చేశారు.భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ మాటల్లో.. "వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్కవి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బలమైన భావాన్ని.. మానవత్వన్ని.. ఆకాశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జనసామాన్యం గుండెల్లో నిక్ష్లిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి శ్రీ సీతారామ శాస్త్రి గారు. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన ఆ మహానీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. అశ్వస్థతో ఆసుపత్రిలో చేరిన శాస్త్రిగారు కోలుకుంటారు అని భావించాను. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ సీతారామశాస్త్రి గారు మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు.. తెలుగు సాహితీ లోకానికి కూడా తీరని లోటు. వారిని కేవలం సినీ గేయ రచయితగా చూడలేము.ఆయన ఏ పాట రాసిన అందులో సాహిత్యం నిక్ష్లిప్తమై ఉంటుంది.

నేను నటించిన సుస్వాగతంలో 'ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి '.. పాట కావచ్చు.'తొలిప్రేమ'లో 'ఈ మనసే..' పాటల్లో అలతి అలతి పదాలతో ప్రేమ భావనలు చెప్పారు.ప్రేమ గీతాలు, అల్లరిపాటలు.. ఏవైనా అంతర్లీనంగా మంచి చెప్పాలని తపించేవారు. ఒక కవిగా సమాజాన్ని నిలదీసి బాధ్యతలు గుర్తు చేసేవారు.' నిగ్గదీసి అడుగు..', 'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని..' లాంటి పాటలు వింటే సమాజాన్ని నిత్య చైతన్యంగా వుండాలని శ్రీ శాస్త్రిగారు ఎంత తపించారో అర్ధమవుతుంది.'ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు...', ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..' లాంటి పాటల్లో ఆశావాదాన్ని అందించారు. భావి తరాలకు మన తెలుగు మన తెలుగు సాహితీ సంపాదనను వారసత్వంగా ఇవ్వాలని తపించేవారు. శాస్త్రి గారి రచనల్లోని వైవిధ్యాన్ని చూస్తే ఆయన కలానికి ఎన్ని పాళీలో అనిపిస్తుంది.

శ్రీ శాస్త్రి గారి మరణం వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో లోటు. నాపట్ల ఎంతో ఆప్యాయతను కనబరిచేవారు. వారితో మాట్లాడితే -సాహిత్యం, అధ్యాత్మికం నుంచి అభ్యుదయ వాదం, సామ్యవాదం వరకూ ఎన్నో అంశాల గురించి కూలాంకుషంగా చెప్పేవారు. శ్రీ శాస్త్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇట్లు పవన్ కళ్యాణ్, " అని ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: