ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ రోజు ఉదయం ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత నటుడు తనికెళ్ల భరణి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఫిలింఛాంబర్ కు వచ్చారు. సిరివెన్నెల గారి పార్ధివదేహాన్ని చూస్తూనే బోరున విలపించారు తనికెళ్ల భరణి. ఆయన్నిచూస్తూ తన దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. దర్శకుడు త్రివిక్రమ్ ని కౌగిలించుకొని కన్నీటిపర్యంతమయ్యారు తనికెళ్ల భరణి.

 అనంతరం ఆ దుఃఖం తోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సతీమణిని ఆయన పరామర్శించారు. ఆమెను ఓదార్చే సమయంలో కూడా తనికెళ్ల భరణి గారికి కన్నీళ్లు అస్సలు ఆగడం లేదు. ఆమెను ఓదారుస్తూనే తన కన్నీళ్లు ఆపుకోలేక బోరున ఏడ్చారు. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత ఓదారుస్తున్న తనికెళ్ల భరణి అలా ఏడుస్తూనే ఉన్నారు. ఇక దాని అనంతరం మీడియాతో తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. సిరివెన్నెల గారి తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.." మేము ఇద్దరం ఒకేసారి సినిమా పరిశ్రమకు వచ్చాం. మాకు స్రవంతి మూవీస్ మొదటి వేదిక అయింది.

 స్రవంతి మూవీస్ బ్యానర్ లో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసాం. అక్కడే ఎన్నో రోజులు నిద్ర పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. తనకంటే సిరివెన్నెల కేవలం రెండు నెలలు మాత్రమే పెద్దవాడని.. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడని భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పటి నుండి వారి కుటుంబంతో టచ్ లో ఉన్నానని తనికెళ్ల భరణి తెలిపారు. ఇక ఆయనతో పాటూ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్,పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్,మహేష్ బాబు,నాని, రానా దగ్గుబాటి తదితరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భౌతికకాయానికి నివాళ్ళు అర్పించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: