అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్‌ అయిన ఈమె 2005లో సూపర్‌ చిత్రంతో నాగార్జునకు జంటగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్‌ పాత్రలకే పరిమితమయ్యారు. అదే సమయంలో తమిళంలోనూ రెండు అనే చిత్రంతో నటుడు మాధవన్‌కు జంటగా పరిచయం అయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్‌ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు.

ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సినిమా ఆమెను దాదాపు పక్కన పెట్టేసింది. అనుష్క చివరగా నటించిన చిత్రం నిశ్శబ్దం. అది ఎలాంటి శబ్దం లేకుండానే థియేటర్ల నుంచి నిష్క్రమించింది. నవీన్‌ పోలిశెట్టితో కలిసి చిత్రం జరుగుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా, అది ఇప్పటి వరకు సెట్‌పైకి రాలేదు. మధ్యలో ప్రభాస్‌తో ప్రేమాయణం అంటూ వార్తలు గట్టిగానే ప్రచారమయ్యాయి.

అయితే వాటిపై ఇద్దరూ స్పందిస్తూ తాము మంచి ఫ్రెండ్స్‌ అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో 42 వయసును టచ్‌ చేస్తున్న అనుష్క మనసు పెళ్లిపై మళ్లిందనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఇటీవల గోవాలో ఉన్న తన యోగా గురువును కలుసుకోవటానికి వెళ్లిన అనుష్క అక్కడ కొన్ని రోజుల పాటు యోగాకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకుని తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు చెందిన ఓ గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలు స్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది ప్రశార్థకమే….

మరింత సమాచారం తెలుసుకోండి: