ఒకప్పుడు ఆశా సైనీగా టాలీవుడ్‌లో నటించి అందరిని మెప్పించిన నటి ఫ్లోరా సైనీ. లేటు వయసులో కూడా కొన్ని హాట్‌ క్యారెక్టర్లు కూడా పోషించిన ఈ నటి ఇప్పుడు గృహ హింసపై స్పందించింది.తొలిసారి 2018లో మీ టూ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ తనను హింసించాడని ఆమె చెప్పింది.

ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ ఆ చేదు అనుభవాన్ని మరోసారి ఆమె గుర్తు చేసుకుంది. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మరెవరో కాదు సినిమా ప్రొడ్యూసర్‌ గౌరంగ్‌ దోషి. అతని కోసం తాను ఇల్లు వదిలి వచ్చేశానని చెప్పింది. మొదట్లో అతడు చాలా బాగున్నాడని, తన ఇంటివాళ్లు కూడా మోసపోయారని ఫ్లోరా తెలిపిందట. ఈ మధ్య జరిగిన శ్రద్ధా వాకర్‌ హత్య గురించి కూడా ఆమె స్పందిస్తూ.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఎలా వేధించాడో  కూడా చెప్పుకొచ్చింది.

"శ్రద్ధా విషయంలోనూ అదే జరిగిందని తెలుస్తుంది.. అలాంటి వాళ్లు మొదట కుటుంబం నుంచి దూరం చేస్తారు. నేను కూడా అతని కోసం ఇల్లు వదిలి వచ్చేశాను. వారం రోజుల్లోనే దెబ్బలు తిన్నాను. సడెన్‌గా నన్ను ఎందుకు కొడుతున్నాడో అస్సలు అర్థం కాలేదు" అని ఆమె న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తన పేరెంట్స్‌ వద్దంటున్నా వినకుండా తాను గౌరంగ్‌ కోసం వెళ్లానని తెలిపింది.

"ఒక రోజు నన్ను చాలా దారుణంగా కొట్టాడు. నా దవడ కూడా విరిగింది. తన తండ్రి ఫొటో బయటకు తీసి.. నా తండ్రిపై ఒట్టేసి చెబుతున్నా ఇవాళ నిన్ను చంపేస్తా అని కూడా బెదిరించాడు. అతడు ఆ ఫొటోను వెనక్కి పెట్టేలోపు మా అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఇలాంటి సమయంలో పారిపోవడమే కరెక్ట్‌ అని. ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా, చేతిలో డబ్బు ఉందా లేదా అనేది చూడకుండా బతికి ఉండటం కోసం పారిపోవాలి అని కూడా చెప్పేది. అప్పుడే ఇంటికి వెళ్లిపోయి, తిరిగి అతని దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను" అని ఫ్లోరా చెప్పింది.

మరుసటి రోజే తాను అతనిపై పోలీస్‌ కేసు కూడా పెట్టడానికి వెళ్లినట్లు కూడా తెలిపింది. అయితే మొదట్లో పోలీసులు అందుకు నిరాకరించినా.. చివరికి తాను రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల కిందట నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మెరిసిన ఫ్లోరా సైనీ.. హిందీలోనూ లవ్‌ ఇన్‌ నేపాల్‌, దబంగ్‌ 2, ధనక్‌, స్త్రీలాంటి సినిమాల్లో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: