కోలీవుడ్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రేమజంట ఎవరంటే నయనతార- విఘ్నేష్ శివన్ అని చెప్పొచ్చు. త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకోనున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. పలు కార్యక్రమాలలో కలిసి కనిపించే ఈ జంట విదేశాలలోను చక్కర్లు కొడుతూ, అక్కడ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు . హీరోలతో సమానమైన ఇమేజ్ను సంపాదించుకుని లేడీ సూపర్స్టార్గా చెలామణి అవుతోంది నయనతార. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకుంది.
అంతేకాకుండా దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారామణిగా కూడా నిలిచింది. గతంతో శింబు, ప్రభుదేవలను గాఢంగా ప్రేమించిన నయన్ అనూహ్యంగా బ్రేకప్ చెప్పేసింది. తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ లో పడిపోయింది. పలు ఈవెంట్స్లో తన భర్త విఘ్నేష్ శివన్ అని నయనతార పరోక్షంగా కూడా చెప్పింది. అయితే త్వరలో వీరిద్దరు ఓ సినిమా చేయనున్నారనేది తాజా సమాచారం. చెన్నైలో వీరిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
తన ప్రియుడికి దర్శకుడిగా సరైన అవకాశాలు రాకపోవడంతో స్వయంగా నయనతార నిర్మాతగా మారిందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించబోయే కొత్త చిత్రానికి నయనతార నిర్మాతగా వ్యవహరించనుంది. యువనటుడు అధర్వ హీరోగా నటించనున్న ఆ చిత్రానికి ‘ఇదయం మురళి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ వార్తలను తాజాగా నయన్ కొట్టిపారేసింది. `నేను నిర్మాతగా మారానన్నది పూర్తిగా అవాస్తవం. ఆ వార్తలను నమ్మకండి. నేను ప్రస్తుతం నటనపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాన`ని నయన్ స్పష్టం చేసింది.