బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక త్వరలో ప్రారంభం కానున్న మూడో సీజన్‌కు నాగార్జున కానీ వెంకటేశ్‌ కానీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. 
 
ఈ షోలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ పార్టిసిపెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తుందని అందరూ అనుకుంటున్న వేళ.. ఈ షోపై రేణూ దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడంలేదని స్పష్టం చేశారు. అయితే బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాలని అనుకుంటున్నానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారా అని అడుగుతూ ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. తాను ఈ షోలో పాల్గొనడం లేదని.. అయితే బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమా పనుల్లో బిజీగా వున్నానని.. మళ్లీ నటన మొదలుపెట్టబోతున్నానని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. అలాగే బిగ్ బాస్ సూపర్ హిట్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: