సూపర్ స్టార్ రజనీకాంత్ కు సౌత్ లో ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. ఒక చిన్న కుటుంబం నుండి వచ్చిన రజని సూపర్ స్టార్‌గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు. అందుకనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితంకు సంబంధించిన విషయాలను 5వ తరగతి పాఠ్యాంశ పుస్తకంలో చేర్చిన విషయం తెల్సిందే. కష్టపడి కింది స్థాయి నుండి పైకి వచ్చిన వారి గురించి ఆ పాఠ్యంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రజినీకాంత్ గురించి పాఠ్యాంశంలో చేర్చారు. కార్పెంటర్ గా పని చేసిన రజినీకాంత్, తర్వాత బస్ కండక్టర్ గా.. ఆ తర్వాత సూపర్ స్టార్ గా మారిన జర్నీని అందులో వివరించారు. రజినీకాంత్ అభిమానులకు ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే కొందరికి మాత్రం తప్పనిపిస్తుంది. రజినీకాంత్ కంటే గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉంటే ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఏంటీ అంటూ సీమన్ ఘాటుగా ప్రశ్నిస్తున్నాడు.


సినీ దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ అధినేత..సీమన్ తాజాగా నెల్లై జిల్లాలో ఆందళన కార్యక్రమం నిర్వహించాడు. ఆ సందర్బంగా సీమన్ మాట్లాడుతూ.. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నంత మాత్రాన పుస్తకంలో చేర్చాలా అంటూ ప్రశ్నించాడు. అలా అనుకుంటే రజినీకాంత్ కంటే గొప్ప నటుడు, నిర్మాత, దర్శకుడు..ఎన్నో విజయాలను అందుకున్న వ్యక్తి కమల్ హాసన్. మరి కమల్ హాసన్ ఎందుకు పనికి రాడు.. అంటూ సీమన్ ఘాటైన విమర్షలను చేశాడు.


రజినీకాంత్ నటుడిగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావచ్చు కాని ఆయన్ను మించిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఆయన జీవితాన్నే ఎందుకు పాఠ్యంగా చేర్చారో తెలియదన్నాడు. ఇక త్వరలో జరుగబోతున్న నడిగర్ సంఘం ఎన్నికలపై సీమన్..ప్రస్తుతం ఉన్న వారు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదు. అందుకే కొత్త వారు వస్తే బాగుంటుంది. కే. భాగ్యరాజ్ మంచి వ్యక్తి.. ఆయన గెలిస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే అభిప్రాయం నాకుందని సీమన్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపాడు. సీమన్ చేసిన విమర్శలు ప్రస్తుతం రజినీకాంత్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానై ఎంత దూరం వెళతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: