తెలుగు ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. నాయకానాయికల కంటే కథకే ప్రాధాన్యతనిస్తూ మంచి సినిమాల్ని ఆదరిస్తున్నారు అని చెప్పింది అక్షత శ్రీనివాస్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం స్పెషల్. నందమ్శ్రీవాస్తవ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ ప్రధాన పాత్రధారి. ఈ నెల 21న విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగులో నేను నటిస్తున్న రెండో సినిమా ఇది. పారితోషికం గురించి పట్టించుకోకుండా కథ నచ్చి ఈ సినిమాను అంగీకరించాను. నా పాత్ర శక్తివంతంగా ఉంటుంది. కెరీర్లో విభిన్నమైన ప్రయత్నంగా నిలిచిపోతుంది.
సైకో పతీ అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓ మైండ్ రీడర్ జీవితంలో ఎదురయ్యే మలుపులు ఉత్కంఠను పంచుతాయి. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు వాస్తవ్ ఈ సినిమాను రూపొందించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించాను. అలాగే శేఖరం గారి అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటిస్తూ దర్శకత్వం వహించాను.
తెలుగులో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ నటన నచ్చుతుంది. సురేందర్రెడ్డి నా అభిమాన దర్శకుడు. గ్రంథాలయం పేరుతో మరో సినిమా చేస్తున్నాను. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో సినిమాలు చేయాలనుంది అని తెలిపింది. ఇంకా తనకి ఏవైనా మంచి కధలు లభిస్తే, షార్ట్ ఫిలింలలోను, మరియు బైయోపిక్కులలోను నటించాలనుందని అమ్మడు తెలిపింది.