పూరి జగన్నాథ్ తీసిన మెహబూబా సినిమాను దిల్ రాజు ప్రత్యేకంగా షో వేయించుకొని చూశాడు. తర్వాత సినిమా చాలా బాగా వచ్చిందని, తనకు బాగా నచ్చిందని, అందుకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను తను తీసుకుంటున్నానని ప్రకటించాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో మెహబూబా సినిమాను విడుదల చేసిన దిల్ రాజు, దారుణమైన నష్టాల్ని చూశాడు. నిజంగా చెప్పాలంటే రాజుకు ఇది పెద్ద దెబ్బ.

దిల్ రాజుకు నష్టాలు కొత్తకాదు. తట్టుకోగలడు. కానీ మెహబూబా సినిమాను మెచ్చుకుంటూ మాట్లాడిన మాటలు, అతడి ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఆ ప్రభావం ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాపై పడింది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయమని దిల్ రాజును కోరాడు పూరి జగన్నాథ్. కానీ దిల్ రాజు మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పేశాడు. 
ఇస్మార్ట్ శంకర్ సినిమాను కనీసం నైజాంలో కూడా పంపిణీ చేయడానికి ఇష్టపడటంలేదు దిల్ రాజు. అంతేకాదు, సినిమాను చూడ్డానికి కూడా ఇష్టపడలేదట. ప్రస్తుతం తనకు చాలా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయని, వీలుపడదని చెప్పేసి తెలివిగా తప్పించుకున్నాడు. కానీ దిల్ రాజు వెనక్కి తగ్గడానికి కారణం మెహబూబా సినిమా అనే విషయం తెలిసిందే.

ప్రస్తుతానికి రామ్ తరపు నుంచి స్రవంతి రవికిషోర్ రంగంలోకి దిగారట. దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు కూడా ఫెయిల్ అయితే నిర్మాతలు మరో బయ్యర్ ను వెదుక్కోవాల్సిందే. మరో 10 రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతోంది. కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తికాలేదు. పూరి జగన్నాథ్, రామ్ ట్రాక్ రికార్డుతో ఈ సినిమాను కొనేందుకు ట్రేడ్ అంతగా ఆసక్తి చూపడంలేదు. ఉన్నంతలో నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మికి ఊరట కలిగించే అంశం ఏదైనా ఉందంటే.. అది ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడమే. జీ తెలుగు ఛానెల్ ఈ హక్కులు దక్కించుకుంది. ఇక ఈ పదిరోజుల్లో ఏ జరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: