‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో చాలా రోజుల తర్వాత విజయం సాధించాడు తేజ. దాదాపుగా దశాబ్దం తర్వాత తేజకి హిట్ వచ్చింది. పొలిటికల్ డ్రామాతో కూడిన ఆ సినిమాలో రానా దగ్గుబాటి నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ తేజకి వరుసగా ఆఫర్లు వస్తాయని అనుకున్నారు. కానీ దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత "సీత" వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో మళ్ళీ తేజకి పూర్వపు పరిస్థితే ఏర్పడింది.


సీత’ సినిమా ఫ్లాప్ తర్వాత తేజ తన తర్వాతి చిత్రాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. టాలీవుడ్లో చాలా మంది హీరోలు తేజతో పని చేయడానికి ఆసక్తిగా లేరని వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తేజ ఒక ఫ్లాప్ హీరోను నమ్ముకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. గోపీచంద్. హిట్టు అనే మాట విని చాలా కాలం అయిపోయినా గోపీచంద్ తన ప్రయత్నం మానట్లేదు. త్వరలో అతను ‘చాణక్య’ సినిమాతో పలకరించబోతున్నాడు.


ఫ్లాపులు తనని వెంటాడుతున్నా గోపీచంద్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం తేజ చెప్పిన ఓ కథకు కూడా అతను ఓకే చెప్పాడట. తేజ విషయంలో గోపీలో కృతజ్ఞతా భావం ఉంటుందనడంలో సందేహం లేదు. ‘తొలి వలపు’తో హీరోగా దారుణమైన ఎదురు దెబ్బ తిన్న సమయంలో అతడిని విలన్ పాత్రలోకి మార్చి ‘జయం’ సినిమా తీశాడు తేజ.


ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో.. గోపీచంద్ కి ఎంత పేరు తెచ్చిపెట్టిందో  తెలిసిందే. ఆ తర్వాత ‘వర్షం’లోనూ విలన్‌గా మెప్పించి ప్రేక్షకులకు చేరువైన గోపీచంద్..  ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా పునరాగమనం చేశాడు. ఆ సినిమా హిట్టవడంతో వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి సాయాన్ని గుర్తుపెట్టుకుని తేజతో హీరోగా సినిమా చేయడానికి గోపీచంద్ ఓకే అన్నట్లుగా సమాచారం.దీనిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: