టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అతనొక్కడే సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి, తోలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ని తన సొంతం చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన అశోక్, అలానే ఆపై సూపర్ స్టార్ మహేష్ హీరోగా తీసిన అతిథి, అనంతరం మరొక్కసారి ఎన్టీఆర్ తో తీసిన ఊసరవెల్లి సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఆ తరువాత కొన్నాళ్ళకు రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన కిక్ సినిమా సూపర్ డూపర్ హిట్ సాదించి, ఆయన కెరీర్ కు మంచి కిక్ ఇచ్చింది. అనంతరం బన్నీ హీరోగా వచ్చిన రేస్ గుర్రం మరొక సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సురేందర్ కు మంచి ఊపు నివ్వగా, 

దాని తరువాత వచ్చిన కిక్ 2 మళ్ళి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే ఇటీవల తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ ను రామ్ చరణ్ హీరోగా ధ్రువ పేరుతో తెరకెక్కించి మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డి, కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో, ఒకప్పటి స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, మరియు నిన్న రిలీజ్ అయిన మేకింగ్ వీడియో తరువాత సైరా పై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. తెలుగుతో పాటు, తమిళ్, హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాపై మెగాస్టార్ సహా దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా గట్టి నమ్మకం ఉందట. సినిమా కథ, కథనాలు, క్వాలిటీ విషయాల్లో ఎక్కడా రాజీ పడకుండా ఉండేందుకే సినిమాను ఇన్నాళ్లపాటు జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారని, ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండే రీతిలో ఈ సినిమా రూపొందుతోందని, రేపు రిలీజ్ తరువాత హీరో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి సహా తమ అందరి కెరీర్ కి ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ గా నిలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తోందట సైరా యూనిట్. మరి ఎన్నో అంచనాలున్న ఈ సినిమా, రేపు విడుదల తరువాత ఆ అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో వేచి చూద్దాం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: