టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఏకంగా టాలీవుడ్లో ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి మరీ నిర్మించారు. పీవీపీ - దిల్ రాజు - చలసాని అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా సొషల్ మేసేజ్ నేపథ్యంలో తెరకెక్కింది. మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు.
మే 9వ తేదీన వచ్చిన ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. మహర్షి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక రికార్డులు తిరగరాసి తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా నైజాం లో మహర్షి 30 కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు నమోదు చేసింది. నైజాంలోనే ఆ రేంజ్ షేర్ అంటే మామూలు విషయం కాదు. ఇక వంద రోజులు పూర్తి చేసుకున్న మహర్షి... మొత్తం ఐదు సెంటర్లలో ఈ రికార్డు సాధించగా.. ఈ ఐదు సెంటర్లు ఏపీలోనే ఉన్నాయి.
ఈ ఐదు సెంటర్లలో మూడు డైరెక్ట్ వందల రోజుల ప్రదర్శించబడిన థియేటర్స్ కాగా... మరో రెండు షిఫ్టెడ్ సెంటర్స్. ఈ ఐదు సెంటర్లను చూస్తే వైజాగ్, చిలకలూరిపేట, ఆదోని సెంటర్లలో మహర్షి నేరుగా వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. గుంటూరుతో పాటు నెల్లూరులో మాత్రం షిఫ్టెడ్ థియేటర్లలో వంద రోజులు ఆడింది.
ప్రస్తుతం ఎంత గొప్ప హిట్ సినిమా అయినా రెండో వారానికే థియేటర్ల నుంచి ఎత్తేస్తున్నారు. అలాంటి టైంలో మహర్షి ఏకంగా ఐదు సెంటర్లలో 100 రోజులు ఆడడం గొప్ప విషయమే. ఇక మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత మళ్ళీ ఆయన వంశీ పైడిపల్లి చిత్రంలో నటించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.