2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం గీత గోవిందం. ఈ సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. రష్మిక అయితే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. అయితే దర్శకుడు పరశురామ్ ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. 16కోట్ల బిజినెస్ తో గీతా గోవిందం రిలీజైతే.. 80కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. గీతా గోవిందం ఘన విజయంతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయి వరుస అవకాశాలు అందుకున్నాడు. గీత గోవిందం వచ్చి ఏడాది అయినా.. పరశురామ్ తర్వాతి ప్రాజెక్ట్ చేయలేదు. 

"శ్రీరస్తు శుభమస్తు" రిలీజ్ కు ముందే.. గీతా ఆర్ట్స్ లో మరో సినిమా ఒప్పుకున్నారు పరశురామ్. ఈ క్రమంలో గీతా గోవిందం చేశాడు. రిలీజ్ తర్వాత పరశురామ్ తో మరో సినిమా చేస్తున్నట్టు అల్లు అరవింద్ అనౌన్స్ చేశాడు. బన్నీకోసం కథ రెడీ చేస్తున్నాడని.. కాదు కాదు.. గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య నటించే మూవీకి పరశురామ్ దర్శకుడంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఒక్కటీ వర్కవుట్ కాలేదు. 

పరశురామ్ డైరెక్ట్ చేసే హీరోల జాబితాలో ఆ మధ్య మహేశ్ కూడా చేరాడు. సూపర్ స్టార్ కోసం పరశురామ్ కథ రెడీ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరు" తర్వాత పరశురామ్ మూవీ మొదలవుతుందన్న వార్తలు వినిపించాయి. ఈ కాంబినేషన్ లో కూడా డౌటే అంటున్నాయి ఫిలిం వర్గాలు. పరశురామ్ చెప్పిన కథ మహేశ్ కు నచ్చకపోవడమే ఇందుకు కారణమట. ఏడాది పాటు విసిగిపోయిన ఈ దర్శకుడు ఇదే కథను వేరొకరితో తీస్తాడో.. మళ్లీ కథ రెడీ చేస్తాడో చూడాలి. అదేమిటో కానీ.. సూపర్ హిట్ డైరెక్టర్ కు కూడా కష్టాలు తప్పడం లేదు. 





మరింత సమాచారం తెలుసుకోండి: