ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్ర టీజర్ నిన్న విడుదలై యూట్యూబ్ వ్యూస్ ను దుమ్మురేపుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే 23 మిలియన్ల వ్యూస్తో సంచలనాలు రేపుతుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ వీక్షకులు సునామీని సృష్టించారు.
అక్టోబర్ 2 న రిలీజ్ కు సిద్ధమౌతున్న సైరా మూవీ భారీ అంచనాలతో తెరపైకి వస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. చిరుతో సరసన నయన తారా, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితామ్ తో పాటు విజయ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ నాజర్ తదితర సీనియర్ నటులు ఉన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
‘‘చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీభాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలను. కానీ, ఆ చరిత్రపుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు.. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు..’’ అంటూ పవన్ కళ్యాణ్ గాత్రంతో అద్భుతమైన విజువల్స్తో టీజర్ మొదలైంది. ‘హు ఈజ్ దిస్ నరసింహారెడ్డి?’ అంటూ బ్రిటిష్ అధికారి అన్నప్పుడు ఉదయించే సూర్యుడిని చీల్చికుంటూ గుర్రంపై ఆ వీరుడు వస్తోన్న దృశ్యం టీజర్కే హైలైట్.
‘‘సింహంలాంటోడు దొర. అతడే వాళ్ల ధైర్యం దొర’’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్.. ఆ సమయంలో వచ్చే విజువల్స్ అద్భుతం. మొత్తంగా టీజర్ అద్భుతం, అమోఘం. ఈ టీజర్తో సినిమాపై చాలా మందికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయన టేకింగ్ ఎలా ఉందో టీజర్ను చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక అక్టోబర్ 2న థియేటర్ యుద్ధమే..! టాలీవుడ్లో మళ్లీ రికార్డుల వర్షమే..!