స్టార్ డైరెక్టర్ శంకర్ - కమల్ హాసన్ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ భారతీయుడు సీక్వెల్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి షెడ్యూల్ ను ఘనంగా ప్రారంభించి.. అది పూర్తిచేసే క్రమంలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. బడ్జెట్ విషయంలో శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు వచ్చాయి. మొత్తానికి లైకా ప్రొడక్షన్స్ ఇచ్చిన బడ్జెట్ పరిమితుల్లోనే, శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. కానీ ఈ సినిమా నుండి ఓ హీరోయిన్ తప్పుకుంది. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా నుండి డేట్లు కుదరక తప్పుకున్నట్లు తెలిపింది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుండి రాజమండ్రిలో ప్రారంభం కాబోతోందట. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు.
ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భవాని కూడా భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. వెన్నల కిషోర్ తెలుగుతో పాటు తమిళ వెర్షన్ లో కూడ కనిపిస్తారట. అలాగే ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి ఇటు శంకర్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.