మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్‌ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా విడుదలకు సిద్దం అవుతుంది. ఒక ప్రాంతీయ భాష సినిమా ఇన్ని భాషల్లో ప్రేక్షకులను రీచ్‌ అవ్వాలి అంటే కంటెంట్‌ చాలా బలంగా ఉండాలి. అప్పుడే ఇతర భాషల్లో క్లిక్‌ అవుతుంది. బాహుబలి సినిమా బాలీవుడ్‌ లో ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టిందో తెల్సిందే. అందులో ఉన్న కంటెంట్‌ భాషతో సంబంధం లేకుండా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు సైరా చిత్రంలో ఉన్న కంటెంట్‌ కూడా భాషతో పని లేకుండా వసూళ్లను రాబడుతుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.


బ్రిటీష్‌ వారిపై మొట్ట మొదటిగా యుద్దం ప్రకటించి, స్వాతంత్య్ర సంగ్రామానికి నాంధి పలికిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని ఆయన్ను చరిత్ర మర్చి పోయినప్పటికి ఆయనతోనే స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర ప్రారంభం అయ్యిందని టీజర్‌ లో పేర్కొన్నారు. ఈ పాయింట్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్‌ అవ్వడంతో దీనికి రీజినల్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అనే టాక్‌ వెళ్లి పోయింది. బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మన ఇండియాలో దేశ భక్తితో వచ్చే సినిమాలకు ఎక్కువ శాతం మంచి ఆదరణ దక్కుతుంది. అది ఏ భాషలో తెరకెక్కినా కూడా తప్పకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఆదరించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే తప్పకుండా సైరా చిత్రంకు కూడా బాలీవుడ్‌లో మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అన్నట్లుగా అనిపిస్తుంది. బాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం ఆశించినదానికంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉందనిపిస్తుంది.


తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి తెలుసుకోవాలని, ఆయన అప్పట్లో ఎలా స్వాతంత్య్ర సంగ్రామంకు తెర తీశాడని, స్వాతంత్య్ర కాంక్షను అప్పట్లో ప్రజల్లో ఎలా కలిగించాడనే విషయాలను ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెతిస్తున్నాయి. కంటెంట్‌ కు తోడు సినిమాలో ఉన్న అమితాబ్‌, విజరు సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా వంటి వారు కూడా సినిమాపై అంచనాలు పెంచేలా వారి వారి గెటప్స్‌ లో కనిపిస్తున్నారు. మరి సైరా చిత్రం సంచలనాత్మక విజయాన్ని అందుకుంటుందా లేదంటే తెలుగు వరకే సైరా ప్రభంజనం పరిమితం అవుతుందా అనేది మరి కొన్ని వారాల్లో తేలిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: