'సాహో' సినిమాకి తెలుగు తో పాటు బాలీవుడ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసిన ఎవరికైనా అనిపించే మొదటి విషయం ఒక్కటే.. ఇంత క్రేజ్‌ వున్న సినిమాని చేతులారా ఇలా చేసుకున్నారే అని. నిజంగా ఈ సినిమా ఇలా ఘోర పరాజయమవడానికి ఎన్ని కారణాలున్నా కానీ ముఖ్యంగా వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఖచ్చితంగా దర్శకుడు సుజిత్‌ని. 'రన్‌ రాజా రన్‌' సినిమాని తన సొంత తెలివితేటలతో ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించిన సుజిత్‌ 'సాహో'కి బడ్జెట్‌ పెరిగే కొద్దీ తన సత్తా చాలదని తనే అనుకున్నట్టున్నాడు.

సినిమాకి కావాల్సిన అసలు కథ వదిలేసి, హాలీవుడ్‌ సినిమాలని తలదన్నే రీతిలో ఈ సినిమాని తీర్చిదిద్దాలని చూసాడు. దాంతో అతను చూపించాల్సిన ఒరిజినాలిటీ ఎక్కడా చూపించలేదు. ఫస్ట్‌ పోస్టర్‌కి 'బ్లేడ్‌ రన్నర్‌' పోస్టర్‌ని కాపీ కొట్టడం దగ్గర్నుంచి లాస్ట్‌ ఫైట్‌లో 'మ్యాడ్‌ మ్యాక్స్‌'ని తలపించాలనే ప్రయత్నం వరకు సుజిత్‌ ఒక్క విషయంలోను తన ముద్ర వేయలేకపోయాడు. 'లార్గో వించ్‌' కథని కాపీ కొట్టి, అదే సినిమా ఆధారంగా వచ్చిన 'అజ్ఞాతవాసి' ఫ్లాప్‌ అయినా కానీ మొండి ధైర్యంతో నేను తీస్తుంది యాక్షన్‌ సినిమా కదా పక్క క్లిక్‌ అవుతుందని అనుకున్నాడు పాపం.

సినిమాలో ఏ సీన్‌ చూసినా ఏదో ఒక హాలీవుడ్‌ సినిమా నుంచి కాపీ కొట్టినట్టే కనిపిస్తుంది. 'బాహుబలి 2' చూసినా హాలీవుడ్‌ సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌ల నుంచి ఎత్తేసిన సీన్లు కుప్పలుకుప్పలుగా వుంటాయి. అయితే వాటిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంత ఎఫెక్టివ్‌గా చూపించాలనే దాంట్లో రాజమౌళి చాలా జీనియస్. ఒక్కో సినిమా నుంచి ఒక్కో సీన్ కాపీ కొట్టేస్తే సినిమా అయిపోతుందని డిసైడయిన సుజిత్‌ తన సినిమాకి తల, తోక లేకుండా పోయిందని గుర్తించకపోవడంతోనే సాహో దారుణంగా పరాజాన్ని చూడవలసి వచ్చింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: