టాలీవుడ్ నటుడిగానే కాక మరొకవైపు రచయితగా కూడా తన సినిమాలకు పని చేసే అడివి శేష్, కొన్నాళ్ల క్రితం పివిపి బ్యానర్ పై నిర్మితం అయిన క్షణం సినిమా నుండి ఇప్పటివరకు వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇటీవల ఆయన హీరోగా మరొక్కసారి పివిపి బ్యానర్ పై నిర్మితం అయిన సినిమా ఎవరు. నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలిరోజు తొలిఆట నుండి సూపర్ హిట్ టాక్ రావడం, అలానే అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం జరిగింది. 

ఆకట్టుకునే కథ, కథలనతో పాటు క్షణక్షణం థ్రిల్లింగ్ సీన్స్ తో, అలానే ఊహించని అద్భుతమైన ట్విస్టులతో సాగిన ఈ సినిమాపై ప్రేక్షకులు సహా కొందరు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపించడం జరిగింది. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి, ఇంకా అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ సాధిస్తున్న ఎవరు సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకాభిమానం మాత్రం తగ్గడం లేదు. ఇక అసలు విషయంలోకి వెళితే, ఇటీవల రిలీజ్ అయిన ఎవరు సినిమాని జపాన్ లో వీక్షించిన రీనా అనే జపాన్ అమ్మాయి, ఆ సినిమా తనకు బాగా నచ్చడం, అలానే హీరో అడివి శేష్ నటన మరింతగా నచ్చడంతో, ఆయనను కలిసి ఇండియాలో కూడా సినిమా వీక్షించాలనే తలంపుతో, ఏకంగా ఇండియాలోని హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. 

అంతేకాక, ఆ సినిమాలోని సన్నివేశంలో మాదిరిగా, హైదరాబాద్ లోని తాజ్ హోటల్ లో బస చేసిన ఆమె విషయం, హీరో అడివి శేష్ దాకా చేరడంతో, శేష్ తాజ్ హోటల్ కు చేరుకొని తన అభిమానిని సాదరంగా పలకరించి, ఆమెతో కలిసి విందు చేయడంతోపాటు ఆమెతో కలిసి చాలాసేపు ఎంతో సరదాగా గడిపారు. ఇక తన జపాన్ అభిమాని రీనాతో కలిసి గడిపిన వీడియోని, శేష్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బహుశా ఎల్లలు దాటిపోయిన అభిమానం అంటే ఇదేనేమో అంటూ పలువురు నెటిజన్లు శేష్ పై రీనా చూపుతున్న అభిమానాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: