సినీ పరిశ్రమలో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం టాలీవుడ్ లో ప్రముఖ దర్శక, నిర్మాతలు కన్నుమూయడం ఎంతో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ లో 80వ దశకంలో ఎన్నో హర్రర్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు ప్రముఖ దర్శకులు శ్యామ్ రామ్సే. తాజాగా శ్యామ్ రామ్సే(67) బుధవారం ముంబైలో మరణించారు.
ముంబైలోని అంధేరీ ప్రాంతంలో జీవిస్తోన్న ఆయన ఆరోగ్యం ఒక్కసారే పాడవ్వడంతో కుటుంబ సభ్యులు కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ రామ్సే కన్నుమూశారు. తులసీ రామ్సే, కుమార్ రామ్సే, శ్యామ్ రామసే, కేశు రామ్సే, గంగు రామ్సే, కిరణ్ రామ్సే సోదరులు 1980- 90 మధ్య కాలంలో పలు హారర్ సినిమాలు తీసి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు.
రొటీన్ కి భిన్నంగా హర్రర్, థ్రిల్లర్, సస్పెన్ తరహా సినిమాలు తీసి మంచి పేరు సంపాదించారు. అప్పట్లోనే వీరు సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను భయపెట్టించేవారు. ఇక శ్యామ్ రామ్సే తన సోదరుడు తులసితో కలిసి 1993 నుండి 2001 వరకు ప్రసారమైన ది జీ హర్రర్ షో అనే భారతీయ టెలివిజన్లో మొదటి భయానక ధారావాహికకు దర్శకత్వం వహించారు. అలాగే స్టార్ ప్లస్, ఇతర ప్రైవేట్ ఛానెళ్లలో హర్రర్ డ్రామా షోలకు కూడా దర్శకత్వం వహించాడు. అప్పట్లో రాత్రి తొమ్మిది తర్వాత ఈ హర్రర్ సీరియల్స్ ప్రసారం అయ్యేవి.
పురానా మందిర్, వీరానా, దో గాజ్ జమీన్ కే నీచే, బ్యాండ్ దర్వాజా, పురానీ హవేలి, అంధేరా, డాక్ బంగ్లా, సబూత్, ఖేల్ మొహబ్బత్ కా, గెస్ట్ హౌస్ వంటి హర్రర్ సినిమాలు ఆయన కెరీర్ లో దిబెస్ట్ మూవీస్ గా చెప్పొచ్చు. తులసి రామ్సే సోదరులు తులసి గత ఏడాది డిసెంబర్ 2018 లో మరణించిన సంగతి తెలిసిందే. శ్యామ్ మృతిపై పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఇతరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.