తనకు 21 ఏళ్లు ఉన్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు బాలీవుడ్ నటి రవీనా టాండన్. మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు ఫేవరెట్ హీరోయిన్ అయిన రవీనా ఇప్పుడు రెండోసారి అమ్మమ్మ అయ్యారు. తాను దత్తత తీసుకున్న ఛాయా, పూజలకు పెళ్లిళ్లు చేశారు. కాగా ఇటీవల ఛాయ పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చారు. తాను అమ్మమ్మనయ్యానంటూ రవీనా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగని రవీనాకు పిల్లలు లేకుండాపోలేదు.

రవీనా.. ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.అయినప్పటికీ తాను చిన్న వయసులో దత్తత తీసుకున్న ఇద్దరు ఆడపిల్లలను రవీనా సొంత బిడ్డలకంటే ఎక్కువ ప్రేమను అందించారు. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు. పెళ్లయ్యాక ఎక్కడ పిల్లల్ని కంటే సినిమా అవకాశాలు రాకుండాపోతాయో అని భయపడి సరోగసీ, ఐవీఎఫ్ పద్ధతులు ఎంచుకుంటున్న ఈ రోజుల్లో రవీనా టాండన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పిల్లలను దత్తత తీసుకుని వారికి మంచి జీవితాన్ని ఇస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

1991లో వచ్చిన ‘పత్తర్ కే ఫూల్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రవీనా. ఆమె ప్రతిభకు గానూ జాతీయ అవార్డు కూడా లభించింది. రవీనా తెలుగులోనూ నటించారు.‘రథ సారథి’, ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశవీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాల్లో నటించారు. రవీనా అంటే మన ప్రభాస్‌కు ఎంతో ఇష్టం. ఆయన నటించిన ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో ప్రభాస్ రవీనా కొంగు పట్టుకుని డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది.

ప్రస్తుతం రవీనా ‘కేజీఎఫ్‌ చాప్టర్ 2’లో నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తు్న్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘కేజీఎఫ్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరాగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.


    మరింత సమాచారం తెలుసుకోండి: