టాలీవుడ్ యాక్షన్  హీరో గోపీచంద్  వరుసగా సినిమాలు ప్రకటిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.  ఆయన నటించిన చాణక్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా ఈనెల 13న సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సినిమాను మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకో సినిమాను ప్రకటించారు.మాచో హీరో గోపీచంద్ కొంతకాలంగా సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. ఒకప్పుడు నిర్మాతల హీరోగా ఉన్న గోపీచంద్ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది.

ఆయన మార్కెట్ బాగా తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో వరుసగా ఆరు డిజాస్టర్లను గోపీచంద్ అందించారు. ‘జిల్’ దగ్గర మొదలైన ఫ్లాప్ ప్రయాణం ‘పంతం’ వరకు కొనసాగింది. దీంతో ఎలాగైనా హిట్టుకొట్టి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలనే కసితో ‘చాణక్య’ అనే స్పై థ్రిల్లర్ మూవీని గోపీచంద్ చేశారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ‘చాణక్య’ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా గోపీచంద్‌కు అవకాశాలయితే మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవలే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌లో గోపీచంద్ ఒక సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం ద్వారా బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడుని పరిచయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో సినిమాను గోపీచంద్ ప్రకటించారు.తనకు ‘గౌతమ్ నంద’ వంటి ఫ్లాప్ సినిమాను ఇచ్చిన టాలెండెట్ డైరెక్టర్ సంపత్ నందికి మరోసారి గోపీచంద్ అవకాశం ఇచ్చారు. ‘యూ టర్న్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ నెం.3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు.భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి గురువారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సంపత్ నంది.


మరింత సమాచారం తెలుసుకోండి: