టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి కె.పద్మాదేవి(95) గురువారం కన్నుమూశారు. పాత తరం సినిమాల్లో ఈమె పేరు అప్పట్లో బాగా మారుమోగింది. భక్తద్రువ(1934) అనే సినిమాతో కన్నడ సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకి 1936లో విడుదలైన ‘సంసారనౌక’ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. కేవలం నటిగానే కాకుండా ఆమె నాలుగు పాటలు కూడా పాడారు. ఆమె పాటలు కొన్ని ఇప్పటికీ అక్కడ మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె నటనకు ఇప్పటికీ అక్కడ అభిమానులు ఉన్నారు.
బెంగళూరుకు చెందిన పద్మాదేవి బళ్ళారి రాఘవాచార్యులు ద్వారా నాటకరంగంలో ప్రవేశించి హెచ్ఎల్ఎన్ నాటక సంస్థలో నటించారు. వసంతసేన, భక్తసుధామ, జాతకఫల ఇలా ఎన్నో మంచి చిత్రాల్లో ఆమె నటించారు. నటిగానే కాకుండా రేడియో, పత్రికారంగంలోనూ ఆమె పని చేశారు. అప్పట్లో కొత్త తరాన్ని సినిమా రంగానికి పరిచయం చేయాలని ఆమె ఎంతో కృషి చేసింది. అందుకోసం ఏకంగా సొంతగా ఓ నాటకం కంపెనీ కూడా మొదలు పెట్టారు. ఆమె మొదలు పెట్టిన నాటక కంపెనీ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు సినీ రంగానికి పరిచయం అయ్యారు. అయితే నటి కె.పద్మాదేవి సినిమాలలో కంటే రంగస్థలంలోనే ఆమె ఎక్కువ కాలం పని చేశారు.
అప్పట్లో రంగస్థల నటులకు ఎక్కువగా సినిమా అవకాశాలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో మహానటి సావిత్రి కూడా మొదట రంగస్థలం నుంచి వచ్చిన వారే అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కూడా ఎంతో మంది రంగస్థలం నుంచి గొప్ప గొప్ప నటులుగా ఎదిగారు..సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. పద్మాదేవి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మనవడు సింగపూర్లో నివసిస్తున్నారు. అతడు రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.