టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయ శాంతి, మురళి శర్మ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. 

మంచి ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక వీటితో పాటు మరోవైపు సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ కూడా సంక్రాంతికే బెర్త్ ని ఖాయం చేసుకుంది. నిజానికి ఈ మూడు భారీ సినిమాల రిలీజ్ లతో కొంతవరకు థియేటర్ల సర్దుబాటులో సమస్యలు తెలెత్తుతాయి అని అర్ధం అవుతోంది. అయితే వీటితోపాటు నేను కూడా అంటూ, నేడు తన తాజా సినిమా ఎంతమంచివాడవురా ద్వారా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించాడు నందమూరి కళ్యాణ్ రామ్. 

పటాస్ తరువాత ఇప్పటివరకు కెరీర్ పరంగా సరైన హిట్ లేని కళ్యాణ్ రామ్, ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ద్వారా మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. అయితే మొత్తంగా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో ఏ సినిమాకు ఎంతమేర థియేటర్లు దక్కుతాయి అనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీటిలో ముందుగా జనవరి 10న దర్బార్, 11న సరిలేరు నీకెవ్వరు, 14న అల వైకుంఠపురములో, 15న ఎంతమంచివాడవురా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నాలుగు సినిమాలలో ఏది ఎంతమేర విజయాన్ని అందుకుని ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: