ఈరోజు జరగబోతున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే ఆ నిరీక్షణ మధ్య ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన ఐదో తరం వారసులు ‘సైరా’ మూవీకి జరిగిన మార్కెట్ లో తమకు రాయల్టీ కింద 50 కోట్లు రావాలి అంటూ మళ్ళీ రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ విషయమై ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన 25 మంది ఈ రచ్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లందరూ తమకు తలో 2 కోట్లు రాయల్టీ చెల్లించాలంటున్నారు. అంతేకాదు నరసింహారెడ్డి జీవితం గురించి పూర్తి సమాచారం అందించింది తామే అని పైగా తమ గ్రామంలో చిత్రీకరణ కూడా జరిపారని ఆ సమయంలో తమ పంటలు కూడా దెబ్బ తిన్నాయని వాళ్లు అనేక అభియోగాలు చేస్తున్నారు.
అయితే ఇటీవల జరిగిన ‘సైరా’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో చరణ్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ గ్రామానికి సాయం చేస్తాం తప్ప ఆయన కుటుంబీకులకు డబ్బులివ్వడం జరగదని తేల్చి చెప్పాడు. దీనితో తిరిగి ఉయ్యాలవాడ కుటుంబీకులు తమ పోరాటాన్ని ఉదృతం చేసారు. దీనితో ఈ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
రీసెంట్ గా విడుదలైన ‘వాల్మీకి’ టైటిల్ గురించి ముందు లైట్ గా తీసుకున్న ఆ మూవీ నిర్మాతలు చివరకు ఆఖరి నిముషంలో ఆ మూవీ టైటిల్ ను మార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి ఈ వివాదాన్ని మరింత కొనసాగిస్తాడా లేదంటే ఎదో ఒక సద్దుబాటు చేసుకుంటాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంలో గతంలో వచ్చిన కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయి అన్న నమ్మకంతో మెగా కాంపౌండ్ ఉయ్యాలవాడ కుటుంబీకులు చేస్తున్న పోరాటాన్ని లైట్ గా తీసుకుంటున్నట్లు టాక్..