టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన సినిమా రిలీజ్ కోసం అవస్థలు పడుతున్నాడు. హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్, మొదట్లో తప్పటడుగులు వేసినప్పటికీ ఆ తర్వాత స్వామిరారా చిత్రంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డాడనే చెప్పవచ్చు. సుధీర్ వర్మ దర్శకత్వం  వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.


అయితే వరుసగా హిట్లు పడుతున్నా కూడా ఆయనకి అంతగా అవకాశాలు రాలేదు. అదీగాక ఆయన నటించిన "అర్జున్ సురవరం" విడుదలకు ఇంకా నోచుకోవట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎప్పుడు వస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు. మొదట ఈ సినిమాకి "ముద్ర" టైటిల్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్ ని అర్జున్ సురవరంగా మార్చారు. సినిమా టైటిల్ దగ్గర స్టార్ట్ అయిన అవాంతరాలు రిలీజ్ కి కూడా అడ్డు పడుతున్నాయి.


మొదట వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా అది వాయిదాపడింది. ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా కష్టాలు తొలగినట్టు కనిపించట్లేదు. మొత్తానికి ‘అర్జున్ సురవరం’ రిలీజ్ సైరా తరువాతే ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చినా, విడుదల ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఏదేమైనా నిఖిల్ కెరీర్ కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.  


ప్రస్తుతం నిఖిల్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరికీ కాంబినేషన్ లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ "కార్తికేయ" ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: