మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న సరికొత్త మూవీ సైరా నరసింహారెడ్డి, రాబోయే గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. నరసింహారెడ్డి  భార్య సిద్దమ్మగా ఆయన సరసన నయనతార తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై అత్యంత భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా, జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరుగుతోంది. 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిన్న రాత్రి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అశేష మెగా ఫ్యాన్స్ మరియు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు విచ్చేసిన అతిథుల్లో పవర్ స్టార్ పవన్, వివి వినాయక్, రాజమౌళి తదితరులు మెగాస్టార్ పై పొగడ్తలు కురిపించడంతో పాటు సైరా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. ఇక హీరో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తన శరీరం సహకరించక పోయినప్పటికీ ఈ సినిమాలో నాచురల్ ఫీల్ మిస్ అవ్వకూడదని చాలావరకు యాక్షన్ సన్నివేశాలు, గుర్రపు స్వారీల్లో ఎటువంటి డూప్స్ లేకుండా తానే స్వయంగా నటించినట్లు చెప్పారు మెగాస్టార్. ఇకపోతే ఈ సినిమా కోసం నిర్మాత చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి తనకంటే ఎక్కువ కష్టపడ్డారని అన్నారు. 

ఇక సినిమాలోని అత్యంత కీలకమైన యుద్ధం ఎపిసోడ్ ని షార్జాలో చిత్రీకరించడం జరిగిందని, మొత్తం దాదాపుగా నెలన్నరపాటు, కొన్ని వేలమంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి ఎంతో శ్రమటోడ్చి చిత్రీకరించిన ఆ ఒక్క ఎపిసోడ్ కు రూ.75 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చెప్పారు మెగాస్టార్. ఇక ఆ మాట విన్న మెగా ఫ్యాన్స్ మరియు టివి చూస్తున్న ప్రేక్షకులందరూ ఒక్కసారిగా నివ్వెరపోయినట్లు సమాచారం. కేవలం సినిమాలోని ఒక్క సన్నివేశం కోసమే అంత భారీ స్థాయిలో ఖర్చు చేసారంటే, ఇక ఈ సినిమా మొత్తానికి ఏ రేంజ్ లో ఖర్చు చేసి ఉంటారో అని కొందరు సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తన్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: