మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమా 'సైరా నరసింహ రెడ్డి'. ఈ ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రిలీజ్ హంగామా ఒక రేంజ్ లో మొదలైంది. అయితే ఈ వేడుకలో చిరు మెగా స్పీచ్ హైలైట్ అని ప్రతీ ఒక్కరు అంటున్న మాట. సైరా అంటూ వేదికపై తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టేసాడు మెగా స్టార్. అందులో ముఖ్యంగా తన డ్రీం ప్రాజెక్ట్ గురించి చెప్పడం అందరిని ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. నిజానికి ఇరవై ఏళ్ల క్రితం చిరు డ్రీం ప్రాజెక్ట్ గా ఎప్పటికైనా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ కథతో ఓ సినిమా చేయాలని తాపత్రయపడ్డారట. కానీ చిరు దగ్గరికి ఎవరూ అలాంటి కథను వినిపించలేదు సరికదా అలాంటి కథ అనుకుంటున్నామనే మాట కూడా చిరు దృష్టికి తీసుకురాలేదట. 

అందుకే పరుచూరి బ్రదర్స్ రాసిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనే స్వాతంత్ర సమరయోధుడి కథ రావడంతో చరణ్ తో కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేయాలని ఫిక్సైయ్యారట. అంతే కాదు ముందుగా 'సైరా' కు మెగా స్టార్ ని దర్శకత్వం వహించమని పరుచూరి బ్రదర్స్ చెప్పారట. అయితే డైరెక్షన్ నేను హ్యాండిల్ చేయలేను..నేనే డైరెక్షన్ చేయాలంటే నటించలేను అనగానే పరుచూరి బ్రదర్స్  ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గా మేము మిమ్మల్ని మాత్రమే ఊహించుకున్నాం అని చెప్పారట.   

అందుకే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందా అనుకున్న సమయంలో చరణ్ సురేందర్ రెడ్డి పేరు సూచించాడని అప్పుడు సురేందర్ రెడ్డిని పిలిచి విషయం చెప్తే తను ఆలోచించి చెప్తా అని అన్నాడని.. అక్కడి నుండి 'సైరా' కోసం ఇంత వరకూ ఎంతో కష్టపడ్డాడని చెప్పారు మెగాస్టార్. ఇక అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా సైరా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖుల తో పాటు అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, నిహారిక తదితరులు నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: