మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మోహన్ బాబు సైరా పై ట్వీట్ చేస్తూ.. 'నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్' అని పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమా మొదటి రోజు దక్షిణాదిలో 35 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి మొదటి రోజే కొత్త రికార్డ్స్ సృష్టిస్తాడేమో చూడాలి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ బ్రహ్మండంగా ఉన్నాయట. మొత్తానికి సైరా కచ్చితంగా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుందని.. కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అట. మరి సైరా ఏ రేంజ్ రికార్డ్స్ ను సృష్టిస్తాడో చూడాలి. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకానున్న థియేటర్ల వద్ద అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు.
కాగా తెలుగు సినిమాల్లోనే అతిపెద్ద చిత్రంగా ఈ చిత్రం రాబోతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లాభాపేక్ష లేకుండా ఈ చిత్రం అత్యున్నతంగా రావడానికి రాజీ పడకుండా ఖర్చు చేశారు. కథ డిమాండ్ ప్రకారం కోటలు, ప్యాలస్ ల సెట్టింగ్స్ మరియు వార్ ఎపిసోడ్స్ కొరకు భారీగా ఖర్చు చేయడం జరిగింది. ఐతే జార్జియా దేశంలో ఒక వార్ ఎపిసోడ్ ఒకటిన్నర నెలకు పైగా చిత్రీకరించారట. దాని కొరకు అక్షరాలా 75కోట్లు ఖర్చు చేశారు. మరి ఆ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోందేమో చూడాలి. ఇక ఈ చిత్రం పై మెగా అభిమానుల్లో ఎంతటి భారీ హోప్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 44 నిముషాలు. ఈ రన్ టైమ్ కొద్దిగా ఎక్కువే. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఏవీ మిస్ కాకుండా చూపించాలి కాబట్టి ఇంత రన్ టైమ్ అవసరమని భావించారట టీమ్. మరి కొన్ని గంటల్లో సినిమా రిపోర్ట్ బయటకు రానుంది.
అయితే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఖచ్చితంగా సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లతో హడావుడి చేస్తున్నారు.