తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలితగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ పని చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన 'గ్యారీ ఓల్డ్ మెన్, 'అమ్మ' బయోపిక్ కూడా చెయ్యనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ క్వీన్.. ఇప్పుడు బరువు కూడా పెరుగుతుందని.. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. అలాగే ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా.. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం కూడా సినిమాలో హైలెట్ చేస్తూ కథ ఉంటుందట. కాగా ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లు పెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.