స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. ఇక ఇటివలే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'సామజవరగమన' బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను సిడ్ శ్రీరామ్ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారు. అయితే వచ్చే యేడాది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న 'అల వైకుంఠపురంలో' సినిమా ఒకటి. తాజాగా ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ ఫైనల్ అని తెలుస్తోంది. ఈ డేట్ కే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పైగా ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక బన్నీ నిన్న కుటుంబం సమేతంగా ఏఎంబి థియేటర్స్ లో సైరా మూవీని వీక్షించడమే కాకుండా మూవీ పై మరియు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.