అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కలిసి నటించిన 'ఎఫ్ 2' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిన సంగతే. ఈ యేడాది అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రం ఇదే అనడంలో సందేహం లేదు. సాధారణ చిత్రంగా విడుదలై భారీ వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పటికే అనేక ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకుంది. త్వరలో గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ నందు ప్రదర్శించడానికి ఎంపికైన ఎకైక తెలుగు చిత్రం ఇదే. దీంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది తమ పనికి దక్కిన గొప్ప బహుమానమని, ఇది గొప్ప గౌరవం లాంటిదని, మరోసారి ప్రేక్షకులకు ధన్యవాదాలని చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేశ్ బాబు తో చేస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి అయిందని తెలుస్తోంది. కాగా మహేష్ అప్పుడే అంత షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక మహేష్ బాబు ఎప్పుడు సెలవులు వచ్చినా తన కుటుంబంతో విదేశాలకు వెళ్తారు. దుబాయ్ మహేష్ బాబుకు ఇష్టమైన హాలిడే స్పాట్. సమయం దొరికినప్పుడల్లా మహేష్ తరచూ అక్కడకి వెళ్తుంటారు. కాగా ప్రస్తుతం మహేష్ తన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్ళారు. మహేష్ తిరిగి వచ్చాక, 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ను తిరిగి ప్రారంభిస్తాడట. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.