నవీన్‌ విజయ్‌ కృష్ణ, మేఘానా చౌదరి, శ్రీనివాస్‌ అవసరాల, సోఫియా సింగ్‌ హీరోహీరోయిన్లుగా, బాలాజీ సానల దర్శకత్వంలో రూపొందిన చిత్రం "ఊరంతా అనుకుంటున్నారు'. రోవాస్కైర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా పండుగని పురస్కరించుకుని ఈ శనివారం విడుదలైన సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్ననేపథ్యంలో ఆదివారం సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీహరి మంగళంపల్లి మాట్లాడుతూ, "సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. "సైరా' లాంటి పెద్ద సినిమా వల్ల కాస్త ఇబ్బంది ఏర్పడింది. థియేటర్ల కొరత ఉంది. కానీ చూసినవాళ్ళు సినిమా చాలా బాగుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అంటున్నారు. చాలా మంది తమకి దగ్గరి థియేటర్‌లో సినిమా లేదంటున్నారు. రెండు మూడు రోజుల్లో థియేటర్లు పెరుగుతాయి. మల్టీఫెక్స్ లు పెరుగుతాయి. దయజేసి సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నారు. "వాల్మీకి', "గ్యాంగ్‌లీడర్‌' చిత్రాలకి క్లాష్‌ వచ్చినప్పుడు దిల్‌రాజుగారు పండక్కి మూడు, నాలుగు సినిమాలైనా ఆడుతాయన్నారు. కానీ ఇప్పుడు మాకు థియేటర్లు దొరకడం లేదు. మమ్మల్ని కూడా ఎదిగేలా సహకరించాలని కోరుకుంటున్నా. చిన్న సినిమాలకు రివ్యూస్‌ చూసి రాయాలని కోరుకుంటున్నా . తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన "శివ' సినిమా విడుదలైన 30 ఏండ్ల తర్వాత సరిగ్గా అదే రోజు మా సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.


హీరో నవీన్‌ విజయ్‌ కృష్ణ చెబుతూ, "సినిమాని విడుదల వరకు తీసుకురావడమే ఓ విజయం. దాన్ని "సైరా నరసింహారెడ్డి' లాంటి పెద్ద సినిమా టైమ్‌లో, అదీనూ పండుగ టైమ్‌లో విడుదల చేయడమంటే గట్స్ కావాలి. మా నిర్మాతల గట్స్ కి అభినందనలు. వారికి ధన్యవాదాలు. కథ బాగుంటే, ఎమోషన్స్ కనెక్ట్ అయి లాజిక్స్ పట్టించుకోరు. సినిమాని చూసిన వాళ్ళంతా బాగుందని అంటున్నారు. ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాలకి మంచి స్పందన వస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని తెలిపారు.
 
చిత్ర దర్శకుడు బాలాజీ సానల చెబుతూ, "సినిమా ఓపెనింగ్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఓ ఫ్రెండ్‌ ఫోన్‌ చేసిన ఊరులో రామాలయం ముందు కూర్చొని మంచి పాట విన్నప్పుడు, వర్షం వచ్చే ముందు వచ్చే వాసన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో సినిమా అంతా బాగుందని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది' అని అన్నారు.

మరో నిర్మాత పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ, "పల్లెటూరు సాంప్రదాయాలను, కట్టుబొట్టు, గ్రామమంతా ఓ కుటుంబంలా ఎలా కలిసి ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే అందరు కూర్చొని దాన్ని ఎలా పరిష్కరించుకుంటారనే విషయాలను, విలువలని ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాం. ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. సినిమాని చూసి ఫలితాన్ని నిర్ణయించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్య్రక్రమంలో మరో నిర్మాత రమ్య గోగుల పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: