సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కాగా ప్రస్తుతం మహేష్ తన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్ళారు. మహేష్ తిరిగి వచ్చాక, 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తాడట. విజయదశమి సందర్బంగా ఈ చిత్రం నుండి కొత్త పోస్టర్ విడుదలైంది. కొండారెడ్డి బురుజు ముందు మహేష్ గొడ్డలి పట్టుకుని నిలబడిన ఈ పోజుకు సూపర్ రెస్పాన్స్ దక్కింది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే ఇన్నేళ్ల మహేష్ కెరీర్లో సంక్రాంతి బరిలో దిగింది కేవలం నాలుగు సార్లే. మొట్టమొదటి జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన 'టక్కరి దొంగ' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది.
ఆ చిత్రం విడుదలైన రెండేళ్లకు 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సంక్రాంతి కి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆతరువాత 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తరువాత పూరి తెరకెక్కించిన బిజినెస్ మెన్ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటికి మహేష్ సంక్రాంతి సినిమాలలో రెండు సూపర్ హిట్లు, ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఒక యావరేజ్ సినిమాగా నిలిచాయి. మరి 2020 సంక్రాంతి కి వస్తోన్న సరిలేరు నీకెవ్వరూ మూవీ మహేష్ కి కలిసి వస్తోందని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్ లో కనిపించనుందట. పూజా హెగ్డే 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుందట. ఇప్పటికే అనీల్ రావిపూడి ఆమెను సంప్రదించాడని.. గెస్ట్ రోల్ కు పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.