గత జులై నెలలో 49 మంది సెలెబ్రిటీలు భారత దేశంలో అసహనం పెరిగిపోతుందని - సామూహిక హత్యలు ఈ దేశానికే మచ్చ తెస్తున్నాయని వీటిని అరికట్టాలని ప్రధాని మోడీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. వీరిలో దాదాపు అందరి సినిమావాళ్ళు ఉండటం విశేషం. అయితే ఈ లేఖపై బీహార్ కి చెందిన ఒక వ్యక్తి ఆ లేఖ.. మతపరమైన భావాలను రెచ్చగొట్టేట్టు ఉందని ఆ 49 మంది సెలెబ్రిటీలపై 'దేశద్రోహం' కేసు వేశారు. దీంతో బీహార్ పోలీసులు ఈ సెలెబ్రిటీలపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.

అయితే ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా మంది సెలెబ్రిటీలు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా - హిస్టారియన్ రొమిలా థాపర్ - వాజ్ పేయ్ - జెర్సీ పింట్ - టీ ఎం కృష్ణ లాంటి..మొత్తం 180 మంది ఈ 49 మంది సెలెబ్రిటీలకి మద్దతుగా సోమవారం ఒక లేఖ విడుదల చేశారు. 49 మంది సెలెబ్రిటీలు రాసిన లేఖలో తప్పు ఏం ఉందని - ఆ లేఖపై దేశద్రోహం కేసు ఎలా పెడతారని 180 మంది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు కేంద్రం ప్రజలను - ప్రముఖులను కోర్టుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తుందని అభిప్రాయపడ్డారు. తమిళ నటుడు - రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అయితే ఏకంగా ఈ కేసుని కక్ష సాధింపు చర్య అంటు విమర్శించారు కూడా.

అయితే బీజేపీ ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని - మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను తాము అడ్డుకోబోమని - తమ పార్టీ మీద - ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని కేంద్ర సమాచార - ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. పోలీసులు మాత్రం ఈ కేసుని సీరియస్ గా తీసుకోవట్లేదని - ఇప్పటివరకు ఈ కేసు ఫైల్ ని కోర్ట్ కి కూడా సబ్మిట్ చేయలేదని చెప్పారు. వాస్తవంగా చూస్తే ఇలాంటి వాటివల్ల కొంతమంది సెలెబ్రిటీలు చాలా ఇబ్బంది పడుత్యున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: