కరోనా వైరస్ నుంచి బాధితులను కాపాడేందుకు ప్రాణాలకు ఫణంగా పెట్టిమరీ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకారో తెలిసికూడా ప్రజల కోసం రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్నారు. వారి సేవలను ప్రపంచం మొత్తం కొనియాడుతోంది. అయితే.. ఇటలీలో కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో మనందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పటివరకు సుమారు ఆరువేల మందికిపైగా మృతి చెందారు. ఇక వేలసంఖ్యలో బాధితులు ఉన్నారు. వీరందరికీ సేవలు అందిస్తున్నారు వైద్యులు. బాధితులను కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇలా ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 29కి చేరింది. బుధవారం ఒక్కరోజే నలుగురు వైద్యులు మృత్యువాతపడ్డారు. అయితే.. వీరందరూ కూడా కరోనా వైరస్తోనే మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటలీలో మరణించిన డాక్టర్ల సంఖ్య 29కి చేరుకున్నట్లు డాక్టర్ల సంఘం అధ్యక్షుడు లోరెంజో టొండో స్వయంగా పేర్కొన్నారు. అంతేగాకుండా... కరోనా వైరస్ ప్రభావం హెల్త్వర్కర్లపై కూడా పడుతోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో సుమారు ఐదు వేల మంది హెల్త్ వర్కర్లకు కూడా కరోనా సోకింది. దీంతో పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. తమకు వ్యక్తిగత ప్రొటెక్షన్ ఇవ్వాలని హెల్త్వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండడంతో మృతదేహాలను ఎక్కడ పూడ్చాలో కూడా తెలియని దయనీయ పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య సుమారు 20వేలకు చేరువలో ఉంది. ఇటలీలోనే మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత స్పెయిన్ ఉంది. ఆ తర్వాత చైనా ఉంది. ఇక కరోనా వైరస్ బాధితుల సంఖ్య మాత్రం ఏకంగా నాలుగు లక్షలకుపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం సుమారు ఒక లక్ష మందికిపైగా కోలుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.