ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయి చివరికి అక్కడ ప్రతి వస్తువు ధర కూడా అమాంతం పెరిగిపోయింది. తద్వారా ఇక సామాన్య ప్రజలు కనీసం మూడు పూటలా తిండి తినలేని పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ఇంధన సంక్షోభం కారణంగా పెట్రోల్ బంకులు ఎక్కడ చూసినా వాహనదారులతో నిండిపోయిన పరిస్థితి. అంతే కాదు పెట్రోల్ డీజిల్ కొట్టించడానికి పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి వాహనాలతో ఎదురుచూస్తూ ఉన్నారు. పెట్రోల్ కోసం వచ్చిన ప్రజలు బంకుల ముందు గంటలకొద్ది నిరీక్షించాల్సి వచ్చిన నేపథ్యంలో ఎంతోమంది చివరికి అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఏర్పడింది.
ఇలా పెట్రోల్ బంకుల వద్ద నీరిక్షణ మరో ప్రాణాలు తీసింది. పెట్రోల్ కొట్టించుకోవటానికి వచ్చిన ఒక ఆటో డ్రైవర్ చివరికి రాత్రంతా నిరీక్షించి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కొలంబోలో వెలుగులోకి వచ్చింది. అయితే శ్రీలంక లోని చాలా చోట్ల బంకుల వద్ద రోజుల తరబడి వేచి చూడలేక తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది. ఇలా పెట్రోల్ వంటగ్యాస్ కోసం నిరీక్షించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 చేరడం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అన్నది కూడా ఊహించుకోవడానికి ఆందోళనకరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.