అగ్రరాజ్యం అమెరికా షాకుల పరంపర కొనసాగుతోంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ భారత్ను దెబ్బతీసేందుకు అమెరికా హెచ్-1బీ వీసా అస్ర్తాన్ని ప్రయోగించనుంది. డాటా లోకలైజేషన్ చేస్తున్న దేశాలకు హెచ్-1బీ వీసాల్లో 10-15 శాతం కోత విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలు భారతీయుల డేటాను భారత్లోనే నిల్వ చేయాలంటూ కేంద్రం ఇటీవల కొత్త నిబంధలను తీసుకొచ్చింది. ఇది పలు అమెరికా కంపెనీలకు ఆర్థికంగా భారం కానుంది. ఈ నేపథ్యంలో భారత ఐటీ రంగాన్ని దెబ్బతీసేందుకు హెచ్-1బీ వీసాల అంశాన్ని తెరపైకి తెచ్చింది.
అమెరికా ఏటా జారీ చేసే 85వేల హెచ్-1బీ వీసాల్లో 70 శాతం వరకు భారతీయులే పొందుతున్నారు. ఏటా ఇండియన్లకు ఇస్తున్న హెచ్1బీ వీసాల్లో 10 నుంచి 15 శాతం కోత పెట్టాలని అమెరికా నిర్ణయించినట్టు గతవారమే తమకు ప్రభుత్వం వివరించిందని ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల పప్పులుడకకుండా వాటి అధికారాలను తగ్గించేందుకు ఇండియా తీసుకున్న ‘డేటా లోకలైజేషన్’పైనే అమెరికా ఈ వీసా తగ్గింపు నిర్ణయం తీసుకుందన్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయితే, ఒక్క ఇండియా మాత్రమే కాకుండా డేటా లోకలైజేషన్కు డిమాండ్ చేసే దేశాలన్నింటికీ ఇది వర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఏ దేశమైతే డేటా లోకలైజేషన్కు డిమాండ్ చేస్తుందో ఆ దేశానికి ఏటా ఇచ్చే వీసాల్లో 15 శాతం వీసాలను కోత పెట్టేందుకు డిసైడ్ అయిందన్నారు. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ఆఫీస్కు చెందిన ఓ మహిళా ప్రతినిధి.. విదేశాంగ శాఖను ఇదే విషయంపై ప్రశ్నించినా స్పందించలేదు.
వీసాలను తగ్గించాలన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారీగా ప్రభావం పడేది మాత్రం ఇండియన్ కంపెనీలపైనేనని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్లపైనే ప్రభావం ఎక్కువుంటుందని అంటున్నారు. అయితే, అమెరికా నిర్ణయంతో దేశంపై పడే ప్రభావమేంటో వెంటనే తేల్చాల్సిందిగా అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించినట్టు సమాచారం. విదేశాంగ శాఖ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక, విదేశీ కంపెనీల పేమెంట్స్ డేటాను ‘ఇండియాలోనే’ స్టోర్ చేయాలని గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సున్నితమైన అంశాలను ప్రాసెస్ చేసే విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అందులో భాగంగానే డేటాను ఇక్కడే స్టోర్ చేయాలని కంపెనీలను ఆదేశించింది. దీని వల్ల అమెరికా కంపెనీలైన మాస్టర్కార్డ్, వీసా వంటి కంపెనీలు భారీగా నష్టపోయాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల దేశాల మధ్య డేటా మార్పిడి ఆగిపోతుందని, కంపెనీలకు ఖర్చు పెరుగుతుందని కొందరు నిపుణులు విమర్శలు గుప్పించారు.