ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ)ల‌కు గుడ్ న్యూస్‌. భారత్‌ పాస్‌పోర్ట్‌ కలిగిన ప్రవాసులకు ఆధార్‌కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. మూడు నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ ప్రవాసులు ఆధార్‌కార్డు పొందాలంటే 180 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆ నిబంధనను తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో భాగంగా తాజా చర్యలు చేపట్టినట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు.


దేశానికి వెలుపల ఉన్న వారు కూడా టైమ్‌ స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఆధార్‌ను ఎక్కడ తీసుకోదలుచుకున్నారో నిర్థిష్టమైన ప్రదేశాన్ని తెలిపితే, వారు భారత్‌ వచ్చిన తరువాత అక్కడకు వెళ్ళి తెచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ``ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సాంకేతికంగా ఇందుకోసం మార్పులు చేస్తున్నాం. ఇతరదేశాల్లో ఉన్న వాళ్లు ఆధార్‌ పొందేందుకు తమ టైమ్‌ స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఆ సమయానికి భారత్‌కు వచ్చి వారు ఆధార్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని, ఆధార్‌ను పొందవ‌చ్చు `` అని  అజయ్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: